అవినీతి మచ్చలేని 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తుమ్మలది.. అభివృద్ధికి నిలువుటద్దం మంత్రి పాలన.. అసత్య ప్రచారాలను నమ్మవద్దు.
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 25: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధార విమర్శలను అశ్వారావుపేట తుమ్మల యూత్ అధ్యక్షులు నార్లపాటి రాజశేఖర్ తీవ్రస్థాయిలో ఖండించారు. మచ్చలేని నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మంత్రి తుమ్మల నిబద్ధతతో, అవినీతికి తావులేకుండా ప్రజలకు చేసిన సేవలే ఆయనకు శ్రీరామరక్ష అని, ఆయనను విమర్శించే స్థాయి జిల్లాలో ఏ రాజకీయ పార్టీకి లేదని స్పష్టం చేశారు. కొందరు నాయకులు భూదాన్ భూములను చిల్లర పైసలకు అమ్ముకున్న చరిత్ర కలిగి ఉంటే, మంత్రి తుమ్మల మాత్రం మారుమూల అటవీ గ్రామాల వరకు బీటీ రోడ్లు, వాటర్ ట్యాంకులు నిర్మించి ప్రతి ఇంటికీ తాగునీరు అందించిన అభివృద్ధి ప్రదాత అని కొనియాడారు. వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంతో మంత్రికి ఎలాంటి సంబంధం లేదని, కేవలం సుప్రీంకోర్టు తీర్పు మరియు భూదాన్ బోర్డు ఫిర్యాదు మేరకే అధికారులు చర్యలు తీసుకున్నారని వివరిస్తూ వాస్తవాలు తెలుసుకోకుండా మంత్రి తుమ్మలపై బురద చల్లడం సూర్యునిపై ఉమ్మేయడమే అవుతుందని మండిపడ్డారు. ప్రతిపక్షాల అభూత కల్పనలను, అర్థ సత్యాలను నమ్మడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అమాయకులు కారని, ఆయనపై ఇలాగే అసత్య ప్రచారాలు చేస్తే సహించే ప్రసక్తే లేదని నార్లపాటి రాజశేఖర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.








