నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.జిల్లా కలెక్టర్, గాంధీచౌక్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి, పరీక్ష జరుగుతున్న తీరు, పరీక్షా కేంద్రం నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తూ, విద్యార్థు లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు చల్లని త్రాగునీరు సరఫరా చేయాలని, పరీక్ష కేంద్రానికి వచ్చే ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించాలని తెలిపారు.
పరీక్షా గదుల్లో వెలుతురు, తాగునీరు, టాయిలెట్ నిర్వహణ సక్రమంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కేంద్రంలోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ సక్రమంగా కొనసాగాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ దైర్యం చెప్పారు. పరీక్ష సిబ్బంది తమ విధులను నిబద్ధతతో, భాద్యతగా నిర్వహించాలని, ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.మొదటి రోజు ఇంటర్ మొదటి సంవత్సరం ద్వితీయ భాష పేపర్-1 పరీక్షకు జనరల్, ఒకేషనల్ కలిపి 18 వేల 258 మంది హాజరు కావాల్సి ఉండగా, పరీక్షకు 17 వేల 667 మంది హాజరు కాగా, 591 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని, మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ వెల్లడించారు.జిల్లా కలెక్టర్ పరీక్షా కేంద్రం తనిఖీ సమయంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.








