‘కొత్తదారి వెతుకులాటలో ఉన్నాం’.. మాజీ మావోయిస్టు అగ్రనేత ఆశన్న కీలక ప్రకటన
దిశ, వరంగల్ బ్యూరో: ‘మేము చావుకు భయపడే వాళ్లం కాదు.. చావుకు భయపడి లొంగిపోయామని చేస్తున్న ప్రచారంలో నిజం లేదు.. ఇకనుంచి చట్టం పరిధిలో పనిచేయాలని నిర్ణయించుకున్న తర్వాతనే లొంగిపోయాం’ అని మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న తెలిపారు.
హన్మకొండ జిల్లా ఖాజీపేట మండలం బట్టుపల్లిలో మాజీ మావోయిస్టులు, అమరుల కుటుంబాలను ఆయన సోమవారం కలిశారు. సమాజంలో మార్పులు జరిగాయని ఆ మార్పులకు అనుగుణంగానే తాము బయటకు వచ్చామని స్పష్టం చేశారు. త్యాగాలు, నిర్బంధాల మధ్య పనిచేశామని అందరినీ కలుపుకొని సంఘటితంగా ముందుకు వెళ్తామన్నారు. అమరుల త్యాగాలు వృథా కానివ్వమన్నారు. తాము బయటకు రావాలని సమాజంలో మార్పులకు అనుగుణంగా పోరాడాలని కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరోలో చెప్పే నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్నీ ఆలోచించి బయటకు వచ్చామన్నారు. ఉన్నవారిని కాపాడుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తాము బయటకు రావడంపై కొన్ని వర్గాలు ఇష్టం వచ్చిన రీతిలో ఆరోపణలు చేశారని అన్నారు. సోషల్ మీడియాలో తమకు నచ్చిన విధంగా పోస్టులు పెట్టారని అన్నారు.
కొత్తదారి వెతుకులాటలో ఉన్నాం..
తాము అజ్ఞాతంలో ఆదివాసీల మధ్య మూడున్నర దశాబ్దాల పాటు పనిచేశామని అన్నారు. తాము తొందరపడే వ్యక్తులం కాదని.. అన్నింటినీ పాజిటివ్గా తీసుకుని ముందుకు పోతామని పేర్కొన్నారు. అందరినీ కలిసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం మాకు ఏ రాజకీయ పార్టీలో చేరాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సమాజంలో ఇంకా సమస్యలు ఉన్నాయని.. మెరుగ్గా వాటిని పరిష్కరించవలిసి ఉందన్నారు. ఓ కుల సంఘానికో, ఓ వర్గానికో పరిమితం కాకుండా అందరినీ కలుపుకొని పోతామన్నారు. లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ గట్టిగా ఉన్న సమయంలోనే నిర్ణయం తీసుకుని ఉండి ఉంటే బాగుండేదన్నారు. ఇంతమంది అమరులయ్యేవారు కాదన్నారు. పదేళ్ల క్రితం పార్టీ బలంగా ఉండటంతో పాటు ప్రభుత్వాలతో చర్చించే అవకాశం ఉండేదన్నారు. పదేళ్లలో బలహీన పడటం వల్ల చివరి నిర్ణయంగా బయటకు వచ్చామన్నారు.
పనివిధానం అనుగుణంగానే అవకాశాలు..
విప్లవంలో కులం ప్రధానంగా ఉండదని అన్ని వర్గాలకు సమప్రాధాన్యత ఉందన్నారు. పనివిధానం అనుగుణంగానే అవకాశాలు ఉంటాయన్నారు. తాము 30 ఏళ్లపాటు దండకారణ్యంలో ఆదివాసీల కోసం పనిచేశామన్నారు. నిర్బంధ స్థితిలో ప్రశ్నించే హక్కు నిలబెట్టుకోవడం కోసం పనిచేశామన్నారు. తాము ఎక్కడికి పారిపోమని విదేశాలకు వెళ్లడం లేదని ఇక్కడే ఉంటామని ప్రజల మధ్యనే కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు. కావాలని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ గడ్డ ఉద్యమాలకు ఊపిరినిచ్చిందన్నారు. ప్రస్తుతతం ఒకమార్పు క్రమంలో ఉన్నామన్నారు. ప్రతికూలత నుంచి కొత్తదారి వెతుకులాటలో ఉన్నామన్నారు. యువకులు ప్రేరణగా నిలవడంతో పాటు ధైర్యంగా పనిచేస్తున్నారని అన్నారు. అన్నింటిని పరిగణలోకి తీసుకొని పనిచేస్తామన్నారు.
బట్టుపల్లి గ్రామంతో విడదీయని అనుబంధం..
బట్టుపల్లి గ్రామంతో తనకు విడదీయని అనుబంధం ఉందన్నారు. ఇక్కడి నుంచే తాను ఉద్యమంలోకి అడుగు పెట్టానని అన్నారు. తన ప్రయాణానికి ఇక్కడి గ్రామ వాసులే అండగా ఉన్నారని అన్నారు. ఇక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి దండకారణ్యం వరకు తనకున్న పరిధిలో ప్రజల కోసం, ఆదివాసీల కోసం పనిచేశామన్నారు. అప్పుడున్న సమస్యలు ఇప్పుడు లేకున్నా కొత్త సమస్యలు ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఆశన్న వెంట పవనానందరెడ్డి అలియాస్ శ్యామ్ దాదా, యాదగిరి అలియాస్ రాజ్మన్, పద్మ, వనిత, వెంకటేశ్, చంప, సంతోష్, అర్జున్, వికాస్ తో పాటు పలువురు ఉన్నారు.








