పాత దరఖాస్తులకే దిక్కులేదు.. మళ్ళీ కొత్త నాటకాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం
నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 10: అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు, మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, గతంలో ప్రజాపాలన పేరుతో సేకరించిన లక్షలాది దరఖాస్తులు చెత్తబుట్టలోకి వెళ్లాయిని, ఇప్పుడు మళ్ళీ ‘ప్రగతి ప్రణాళిక 99 రోజులు’ పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని ఆయన ఆరోపించారు. రెండేళ్ల క్రితం అధికారం కోసం అసాధ్యమైన ఆరు గ్యారెంటీల హామీలిచ్చి, గ్రామగ్రామాన తిరుగుతూ దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం, ఇప్పటివరకు వాటి అతీగతీ చూడకుండానే ఈ కొత్త నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఇదంతా చేస్తున్నారని, ఇచ్చిన వాగ్దానాల అమలుపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వాని నిలదీయాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు. ప్రగతి ప్రణాళిక అనేది కేవలం అబద్ధాల పునాదులపై నిర్మించిన ప్రచారమని, దీనిని ప్రజలు నమ్మవద్దని రాజశేఖర్ హితవు పలికారు.








