అన్న మాట ప్రకారం.. 15 రోజుల్లోనే!*
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలతో కలిసి వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి
‘కబోదుల’ పాలనలో పేదోడి ఘోష.. ‘ఇందిరమ్మ’ రాజ్యంలో పట్టాల పండుగ
కూల్చినోళ్లే నీతులు చెబుతారా?.. విపక్ష నేతలపై మంత్రి పొంగులేటి నిప్పులు
పగటి కలలు కనకండి.. ‘రెడ్ బుక్’ రాసే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? అంటూ ఘాటు విమర్శలు
నేటి గదర్ న్యూస్, ఖమ్మం:
“రాజకీయం అంటే గద్దెనెక్కి దొరతనం చేయడం కాదు.. పేదోడి కన్నీరు తుడవడం. ఈ నెల 1వ తేదీన ఇదే వేదిక మీద నుంచి హామీ ఇచ్చాను.. 15 రోజుల్లోపు మీ సమస్య పరిష్కరిస్తానని. అన్న మాట ప్రకారం, ఇచ్చిన గడువు కంటే ముందే బాధితులుగా ఉన్న నా కుటుంబ సభ్యులను లబ్ధిదారులుగా చూడటం నాకెంతో గర్వంగా ఉందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.” బుధవారం ఖమ్మం ఐడిఓసిలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన 311మంది వెలుగుమట్ల నిర్వాసితులకు ఇండ్ల పట్టాలు, మంజూరు పత్రాలను అందజేశారు.
*కళ్లుండి చూడని కబోదులు!*
గత ప్రభుత్వ పదేళ్ల వైఫల్యాలపై మంత్రి పొంగులేటి నిప్పులు చెరిగారు. “2017 నుంచి ఈ ఆడబిడ్డలు తాగడానికి నీళ్లు లేక, పాములు, జెర్రుల మధ్య నరకం అనుభవిస్తుంటే గత ప్రభుత్వానికి కళ్లు కనపడలేదా? కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరించారు. 2023లో ఇదే కాలనీని కూల్చేయడానికి ప్రయత్నించినప్పుడు పేదలు మిమ్మల్ని ప్రతిఘటిస్తే తోకముడుచుకుని వెళ్లిన మీరు, ఈరోజు పేదోడి గురించి అవాకులు చెవాకులు పేలుతారా? మీకు ఆ నైతిక హక్కు ఎక్కడుంది?” అని మండిపడ్డారు.
*పగటి కలలు.. ‘రెడ్ బుక్’ హెచ్చరికలు!*
ప్రతిపక్ష నేత ‘రెడ్ బుక్’ రాస్తాననడంపై పొంగులేటి ఎద్దేవా చేస్తూ ఘాటుగా స్పందించారు. చీకటి పడకముందే ఎండలో పగటి కలలు కంటున్నారు. నేను ముఖ్యమంత్రిననో, కాబోయే ముఖ్యమంత్రిననో ఊహల్లో ఊగిసలాడకండి. మీ రెడ్ బుక్కులు రాసేదో.. మీరు వచ్చిన తర్వాత కక్షలు చూపించే కార్యక్రమమో.. అసలు అటువంటి అవకాశం తెలంగాణ ప్రజలు మీకు ఇవ్వరు. మీ పగటి కలలు కలలుగానే మిగిలిపోతాయి. మీ దొరల పోకడలు ఇక సాగవు” అని హెచ్చరించారు.
*అర్హతే మా ప్రామాణికం..*
రాజకీయ కక్షసాధింపులు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. చివరికి మా మీద దుమ్మెత్తి పోసిన వాళ్లయినా సరే.. వారు నిజంగా అర్హులై ఉంటే చాలు, కడుపున పెట్టుకుని వారికి పట్టాలు ఇచ్చాం. ఇది పేదోడి దీవెనలతో వచ్చిన ప్రజా ప్రభుత్వం. 311 మందికి ఇక్కడే స్థలంతో పాటు ఇల్లు, ఇండ్ల స్థలాలు ఉన్న మరో 101 మందికి వారి వారి గ్రామాల్లోనే ఇందిరమ్మ మంజూరు పత్రాలు పంపామన్నారు. పేదోడి సొమ్ము దోచుకున్న కేటుగాళ్లు ఎంతటి వారైనా సరే.. ఉక్కుపాదంతో తొక్కి, ఆ సొమ్మును తిరిగి ఇప్పించాలని సీపీకి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
*యుద్ధ ప్రాతిపదికన మోడల్ కాలనీ*
కేవలం పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోమని, వారం రోజుల్లోనే తాగునీరు అందిస్తామన్నారు. రోడ్లు, డ్రైనేజీతో పాటు స్కూల్, ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.








