రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) అక్టోబర్ 1:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని స్థానిక మంజీరా విద్యాలయంలో నేడు ఘనంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం జరిగింది.ప్రకృతిని ఆరాధించే పండగ బతుకమ్మ పండగ పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు, సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ.స్త్రీలు బొడ్డెమ్మను దశమి రోజు నుంచి ఆరంభిస్తారు.మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మలను బతుకమ్మతో పాటు నిమజ్జనం చేస్తారు.బృహతమ్మ నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకుగాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలో పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు.తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా దాదాపు వేయి సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు. ఆడపిల్లలు అందరూ ఒకచోట చేరి తీరొక పూలతో అందంగా పేర్చేది బతుకమ్మ.మొదటి రోజు అమావాస్య రోజు జరుపుకునే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మని, రెండవ రోజు అటుకుల బతుకమ్మని,మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మని, నాలుగవ రోజు నాన్న బియ్యం బతుకమ్మని,ఐదవరోజు అట్ల బతుకమ్మ ,ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని,ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అని,ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అని,చివరి తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ అని సద్దులు కలిపి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది.ఊరువాడ అంతా కలిసి ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీంతో పాటు ఈరోజు పాఠశాలలో ఎల్లో కలర్ డే నిర్వహించడం జరిగింది.పసుపు రంగు అనేది హిందూ సంప్రదాయ ప్రకారం శుభప్రదాయకం.మన నిత్య జీవితంలో కాంతిని ఇచ్చేటటువంటి సూర్యుడు పసుపు రంగులోనే మామిడిపండు, అరటిపండు ,మొక్కజొన్న పైనాపిల్ వీటి వలన ఎన్నో విటమిన్లు మనకు అందుతాయి.నిత్యం మనం ఉపయోగించేటటువంటి పసుపు వంటలలో ఉపయోగించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆంటీబయాటిక్ గా పనిచేస్తుంది.వీటి గురించి పిల్లలకి చక్కగా వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు సంప్రదాయ దుస్తులలో వచ్చి బతుకమ్మలను పేర్చడం జరిగింది.పిల్లలందరూ బతుకమ్మలు ,కోలాటాలు ఆడి చివరికి బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం వలన భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను పండుగల యొక్క గొప్పతనాలను వాటి విశిష్టతను తెలియజేయడమే లక్ష్యంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్, కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు వాసవి,మీనా,భావన మౌనిక పాల్గొన్నారు.