సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్
సిపిఐ(ఎం) ఆద్వర్యంలో మున్సిపాలిటీ వద్ద నిరసన
నేటి గదర్ న్యూస్, వైరా:
శివుడి శిరస్సుపై ఉన్న గంగలాగ వైరా శిరస్సుపై ఉన్న వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండుకుండలా ఉన్నప్పటికీ, వైరా పట్టణంలోని ప్రజలు త్రాగు నీటికి అల్లాడుతున్నారని సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్ విమర్శించారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి ప్రాంతంలో గత పది రోజులుగా పంపు నీరు రాకపోవడంతో బుధవారం సిపిఐ(ఎం) వైరా బ్రాహ్మణపల్లి శాఖ ఆధ్వర్యంలో ప్రజలు స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద పంపు నీటిని విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్ మాట్లాడుతూ 25 వేల ఎకరాలకు సాగునీరు, ఏడు మండలాల ప్రజలకు త్రాగునీరు అందిస్తున్న వైరా రిజర్వాయర్ నిండుకుండలా ఉన్నప్పటికీ వైరా పట్టణ ప్రజలకు త్రాగునీటి కష్టాలు తీరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒకవైపు రహదారులపై పంట కాలువలు మాదిరిగా డ్రైనేజీ మురుగు నీరు పారుతుందని, మరొకవైపు పంపుల్లో చుక్క నీరు రాక ప్రజలు త్రాగటానికి, కుటుంబ అవసరాలకు మంచినీరు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వెంటనే పంపు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ(ఎం) నిరసనకు స్పందించిన మున్సిపాలిటీ కమిషనర్ చింతా వేణు సాయంత్రం నుంచి పంపు నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, నాయకులు కొంగర సుధాకర్, పైడిపల్లి సాంబశివరావు, యనమద్ది రామకృష్ణ, చావా కళావతి, చిత్తోజు స్రవంతి తదితరులు పాల్గొన్నారు.









