వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో మరో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడులో ఇందిరమ్మ ఇండ్ల పైలాన్ను ఆవిష్కరించారు. గ్రామ బొడ్రాయి వద్ద ముఖ్యమంత్రి గారు పూజలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు.
🪴గృహ ప్రవేశం చేసుకున్న కుటుంబాలతో ముఖ్యమంత్రి గారు కొద్దిసేపు ముచ్చటించారు. ఆ ఇండ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ సభ్యులతో కలిసి చాప మీద కూర్చొని వారిచ్చిన అల్పాహారం తీసుకున్నారు. గృహ ప్రవేశం చేసిన ఆడబిడ్డలు బచ్చల నర్సమ్మ, బచ్చల రమణమ్మ కుటుంబాలకు చీరలను బహూకరించారు. గృహ ప్రవేశం చేసిన సందర్భంగా కుటుంబ సభ్యుల అనుభూతిని అడిగి తెలుసుకున్నారు.
🪴అనంతరం స్థానికులతో అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడి వారి బాగోగులను అడిగారు. అందరూ సంతోషంగా ఉన్నారా. సన్నబియ్యం వస్తున్నాయా. రేషన్ కార్డులు వచ్చాయా అంటూ వాకబు చేశారు. ఈ గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయని ప్రశ్నించినప్పుడు 312 ఇండ్లు మంజూరైనట్టు ఆనందంగా చెప్పారు.
🪴ఇండ్లు మంజూరైన వారంతా సంతోషంగా, చల్లగా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షిస్తూ పిల్లలను బాగా చదివించాలని, వారికి పెళ్లిళ్లయ్యాక వారికీ ఇండ్లిస్తామని చెప్పారు. గృహ ప్రవేశం చేసుకున్న ముహూర్తాన చిరు జల్లులు కురవడం శుభసంకేతమని అన్నారు.
🪴గడిచిన పదేండ్లలో ఏటా రెండు లక్షల ఇండ్లు కట్టినా రాష్ట్రంలో ఇప్పటికి 20 లక్షల ఇండ్లు పూర్తయ్యేవని అన్నారు. అలా చేయకపోవడంతో పేదవారి ఆశలు అడియాసలయ్యాయని అన్నారు. తమ ప్రభుత్వం మొదటి విడతగా 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేశామని చెబుతూ, వచ్చే రెండేండ్లలో మరో 4.5 లక్షల ఇండ్లిస్తామని ప్రకటించారు.









