సొసైటీ వైస్ ప్రెసిడెంట్ కట్టం ఎర్రప్ప ప్రభుత్వాన్ని తక్షణమే స్పందించాలని డిమాండ్.
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, సెప్టెంబర్, 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్పందించిన దమ్మపేట సొసైటీ వైస్ ప్రెసిడెంట్ (తెలుగుదేశం పార్టీ) కట్టం ఎర్రప్ప ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆవేదన చెందిన ఎర్రప్ప, రైతులు దేశానికి వెన్నుముక అని, వారి కంటతడి పెట్టడం ప్రభుత్వానికి తగదని అన్నారు. సొసైటీకి చాలా తక్కువ మొత్తంలో యూరియా సరఫరా చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎజెన్సీ ప్రాంతమైన దమ్మపేటలో ఎక్కువ మంది రైతులు ఉన్నప్పటికీ, వారికి ఒక బస్తా యూరియాతో సరిపెట్టుకోమని చెప్పడం హేయమైన చర్య అని విమర్శించారు. రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించిన ఎర్రప్ప, అధికారులు సైతం ఈ పరిస్థితిలో ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తక్షణమే స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చొరవ తీసుకుని, తన సొంత మండలమైన దమ్మపేట రైతుల కోసం యూరియాను మరింత దిగుమతి చేయించి సమస్యను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.









