ఆదివాసి సేన ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ, సివిల్ కేసుల్లో పోలీసులు జోక్యం చేసుకోవద్దని హెచ్చరిక.
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 20: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం, వాగోడ్డు గూడెం గ్రామంలో ఫారెస్ట్ అధికారులు తమ పంటలను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివాసుల కష్టం పండిన చేతికి వచ్చిన పంటను రాత్రిపూట అధికారులు పీకివేయడం దుర్మార్గమైన చర్య అని ఆదివాసి సేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులను తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పంటలను ధ్వంసం చేయడం అనేది చట్టవిరుద్ధమని, వాస్తవ సాగులో ఉన్న భూముల్లోకి చొరబడకూడదని అనేక చట్టాలు ఉన్నప్పటికీ, ఫారెస్ట్ అధికారులు వాటిని పట్టించుకోవడం లేదని బాధితులు, ఆదివాసి సేన నాయకులు ఆరోపించారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే, ఆదివాసి సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. అనంతరం జరిగిన ఆదివాసి సేన సమావేశంలో, పోలీసులు సివిల్ వివాదాల్లో విచ్చలవిడిగా తల దూర్చడం రాజ్యాంగ విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోమని పోలీసుల్ని కూడా హెచ్చరించారు. ఈ సమస్యలపై అశ్వారావుపేట మండలంలో రేపు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆదివాసి సేన వెల్లడించింది. ఈ ర్యాలీకి ఆదివాసి సేన కార్యకర్తలు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో న్యాయవాది, ఆదివాసి సేన రాష్ట్ర సహాయ కార్యదర్శి ఊకే రవి అతిథిగా పాల్గొంటారని వారు తెలిపారు. సమస్యలు ఉన్నవారు తగిన సమాచారంతో ఈ ర్యాలీకి రావాలని, అలాగే ఆయా మండల బాధ్యులు, మహిళా కమిటీ సభ్యులు తప్పకుండా పాల్గొనాలని ఆదివాసి సేన కోరింది. ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన నాయకులు వగ్గల వెంకటేష్, సోందెం సుమన్ బాబు, కురసం బాబూరావు, కనితి వెంకటేష్, మహిళా నాయకురాళ్లు నేతి సోమమ్మ, కురుస సునీత, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.









