భారీ ర్యాలీతో 8వ వార్డు అభ్యర్థి కాసాని పద్మ సహా ఎనిమిది మంది నామినేషన్.. కాంగ్రెస్ ‘420’ హామీలపై మాజీ ఎమ్మెల్యే నిప్పులు!
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 29: నూతనంగా ఏర్పాటైన అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారాయి. గురువారం తెలుగుదేశం పార్టీ బలపరిచిన బిఆర్ఎస్ అభ్యర్థిగా 8వ వార్డు నుండి కాసాని పద్మ తో పాటు, మరో ఎనిమిది మంది అభ్యర్థులు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ట్రైకార్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మరియు వందలాది మంది కార్యకర్తలు పాల్గొని అశ్వారావుపేట వీధులను గులాబీ మయం చేశారు. నామినేషన్ అనంతరం మీడియా సమావేశంలో మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. “బిఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధే మా అభ్యర్థులను గెలిపిస్తుంది. అశ్వారావుపేటలోని 22 వార్డుల్లోనూ గులాబీ జెండా ఎగరడం ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. “కాంగ్రెస్ పరిపాలన ఎంత దారుణంగా ఉందో అశ్వారావుపేట రింగ్ రోడ్డు పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చని ఈ మాటల ప్రభుత్వంపై ప్రజలు విరక్తి చెందారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వారందరి చూపు ఇప్పుడు బిఆర్ఎస్ వైపే ఉంది” అని స్పష్టం చేశారు. మండల సీనియర్ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్న ఈ నామినేషన్ల పర్వం అశ్వారావుపేట మున్సిపల్ పోరులో బిఆర్ఎస్ ఆధిక్యాన్ని చాటిచెప్పింది.








