దుర్భర పేదరికాన్ని ఓడించి గ్రూప్ -1 విజేతగా నిలిచిన మురళి.
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో గల యూ పి ఎచ్ కాలనీ మురళి సక్సెస్ స్టోరీ.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
మూడేళ్ల ప్రాయంలోనే తండ్రి అనారోగ్యంతో చనిపోయారు. తల్లేమో పారిశుద్ధ్య కార్మికులు. ఆమె అనారోగ్యం పాలైతే ఖర్చుల కోసం ఉన్న ఇంటినీ అమ్మేశారు. ఇలాంటి కఠిన పరిస్థితులు, దుర్భర పేదరికాన్ని అనుభవించినా.. ఆ యువకుడు తనపై తాను నమ్మకం కోల్పోలేదు. చదువే ఆయుధంగా మార్చుకొని కొలువుల పంట పండించారు. ఆఖరికి రాష్ట్రంలోనే అత్యున్నత సర్వీసు సాధించారు. ఖమ్మం నగరం యూపీహెచ్ కాలనీకి చెందిన మురళి గ్రూప్-1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. ఆటో డ్రైవర్గా పనిచేసే ఆయన తండ్రి తన చిన్నతనంలోనే చనిపోయారు. కుటుంబ పోషణ కోసం తల్లి ఖమ్మం పురపాలకంలో ఒప్పంద కార్మికురాలిగా చేసేవారు.కుటుంబ పరిస్థితి నేపథ్యంలో మురళి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ.. అంతా క్రైస్తవ మైనారిటీ విద్యాలయాల్లో ఉచితంగా చదువుకున్నారు. దూరవిద్యలో ఏంబీఏ పూర్తి చేశారు. ఈ క్రమంలో తల్లి తీవ్ర అనారోగ్యం పాలవటంతో చికిత్స కోసం ఉన్న ఇంటినీ అమ్మేశారు. ఆ సమయంలో అయినవారెవరూ ఆదుకోలేదు. ఎలాగైనా ఉన్నత శిఖరాలు అందుకోవాలని ప్రభుత్వ కొలువే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. 2018 నుంచి ఉద్యోగ విజయాలు సాధిస్తూ వస్తున్నారు. 2018లో టీజీఎస్పీ స్పెషల్ కానిస్టేబుల్గా, 2020లో సివిల్ కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. 2024లో టీజీపీఎస్సీ గ్రూప్-4 ఫలితాల్లో జూనియర్ అకౌంటెంట్ కొలువు సాధించారు. ఖమ్మం నగరపాలక సంస్థలో పని చేస్తూనే గ్రూప్-1కు ప్రిపేర్ అయ్యారు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు.









