ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్
గండుగలపల్లిలో కీలక సమావేశం; పొదెం వీరయ్య, ఎమ్మెల్యే జారె సమక్షంలో నేతల విస్తృత చర్చ
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 05: స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు వేగవంతం చేసింది. అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నుండి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయదలిచిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ఆశావహులు, నాయకులు హాజరయ్యారు. దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దిశెట్టి సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, టీపీసీసీ జనరల్ సెక్రటరీ ధర్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సమక్షంలో ఆశావహుల నుంచి వారి పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పట్టును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే సరైన అభ్యర్థులను ఎంపిక చేసి, స్థానాలను గెలుచుకోవడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని నేతలు స్పష్టం చేశారు. ఈ కీలక కార్యక్రమంలో ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘ ప్రతినిధులు, సేవాదళ్ నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.









