ఉపాధ్యాయురాలికి ఆపన్నహస్తం — స్వయంగా ఆసుపత్రికి తరలించి చికిత్స పర్యవేక్షణ
తన కారే అంబులెన్స్గా మార్చి రక్షణ అందించిన వైద్యుడు.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపించారు ఖమ్మం ప్రభుత్వాసుపత్రి డీసీహెచ్ఎస్ కేశగాని రాజశేఖర్ గౌడ్. ప్రమాదంలో గాయపడిన ఓ మహిళా ఉపాధ్యాయురాలిని చూసి క్షణం ఆలస్యం చేయకుండా స్పందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. పెద్దగోపతి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మాధవి సోమవారం సాయంత్రం విధులు ముగించుకొని ఖమ్మం బయలుదేరారు. మార్గమధ్యలో వి.వెంకటాయపాలెం గ్రామ స్టేజీ వద్ద ఆమె ప్రయాణిస్తున్న స్కూటీకి కుక్క అడ్డుగా రావడంతో స్కూటీ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె రక్తమోడుతూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మీ సేవ నిర్వాహకురాలు నాగవాణి వెంటనే సిపిఆర్ చేసి కొంతమేర తేరుకునేలా చేశారు. అదే సమయంలో వైరా వైపు నుంచి కారులో వస్తున్న డీసీహెచ్ఎస్ రాజశేఖర్ గౌడ్ సంఘటనను గమనించి తన కారును ఆపి, స్వయంగా ఆమెను కారులో ఎక్కించుకొని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరగానే దగ్గరుండి ప్రధమ చికిత్స పూర్తి చేసి, అవసరమైన వైద్య సేవలు సమయానికి అందేలా పర్యవేక్షించారు. ఆయన వేగవంతమైన స్పందన వల్ల మాధవి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
గతంలోనూ పలు ప్రమాదాలపై స్పందన :
రాజశేఖర్ గౌడ్ కేవలం ఈ ఒక ఘటనలోనే కాకుండా, గతంలో కూడా ఈ ఏరియాలో కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించారు. కొద్ది నెలల క్రితం ఒక ప్రైవేట్ టీచర్ ఇలానే గాయపడి రోడ్డుపై పడిన సందర్భంలో స్వయంగా కారులో ఆసుపత్రికి తరలించారు. మరో ప్రమాద సంఘటనలో వయోవృద్ధుడికి తీవ్ర గాయాలుతగిలినప్పుడు కూడా తక్షణమే స్పందించి, అవసరమైన వైద్య సహాయం అందించారు. ఈ సంఘటనలు ఆయన తక్షణ, సమర్థ, మరియు మానవతా వైద్య సేవల్లో ముందుంటారని స్పష్టంగా చూపుతున్నాయి.









