వైరా మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలి.
అవినీతి అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకొవాలి.
అవినీతికి గురైన ప్రజల డబ్బును రికవరీ చేయాలి.
సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్ డిమాండ్
సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఆందోళన, వినతి
నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా మున్సిపాలిటీలో లక్షల రూపాయలు ప్రజా సొమ్ము అవినీతి జరిగిందని, జరిగిన అవినీతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులైన అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకొవాలని, అవినీతికి గురైన ప్రజల డబ్బును అంతా రికవరీ చేయాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. అనంతరం వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన జరిగిన ఆందోళనలో భూక్యా వీరభద్రం, సుంకర సుధాకర్ మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ ఏర్పడిన ఏడు సంవత్సరాల కాలంలో కోట్ల రూపాయల అవినీతి మున్సిపాలిటీలో జరిగిందని, పైస్థాయి అధికారులు కఠినంగా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతుందని వారు ఆరోపించారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండదండలతో కొంతమంది అధికారులు, ఉద్యోగులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. వైరా మున్సిపాలిటీలో జరిగిన 54 లక్షల రూపాయల అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా విచారణ చేపట్టి సంబంధించిన అధికారులు, ఉద్యోగులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తూతూ మంత్రంగా విచారణ చేస్తే అవినీతిని అరికట్టలేరని అన్నారు. జరిగిన అవినీతిని ప్రజలకు తెలిసే విధంగా బహిర్గతం చేసి, అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే అవినీతి అడ్డుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సిపిఎం ఆధ్వర్యంలో గతం నుంచి అనేకసార్లు మున్సిపాలిటీ అవినీతి, అక్రమాలపై ఆందోళనలు, పోరాటాలు చేసామని గుర్తు చేశారు. ప్రభుత్వం, ఉన్నత స్థాయి అధికారులు వెంటనే స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున అవినీతిపై ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం వైరా మున్సిపాలిటీ కమీషనర్ గురులింగంకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు మచ్చా మణి, వైరా పట్టణ కమిటీ సభ్యులు హరి వెంకటేశ్వరరావు, పైడిపల్లి సాంబశివరావు, సంక్రాంతి నరసయ్య, గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, షేక్ నాగుల్ పాషా, తోట కృష్ణవేణి, కామినేని రవి, శాఖా కార్యదర్శులు సంక్రాంతి పురుషోత్తమరావు, బెజవాడ వీరభద్రరావు, కంసాని మల్లికాంబ, ఓర్సు సీతారాములు, సీనియర్ సభ్యులు షేక్ జమాల్ సాహెబ్, కురుగుంట్ల శ్రీనివాసరావు, రుద్రాక్షల నరసింహచారి తదితరులు పాల్గొన్నారు.









