గుంతల రోడ్లపై మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆగ్రహం
ఇసుక, మట్టి దందాలపై పెట్టిన శ్రద్ధ రోడ్లపై పెట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ములకలపల్లి మండలంలో ఒక కార్యక్రమానికి వెళ్తుండగా, అంకంపాలెం దాటిన తరువాత రోడ్డు గుంతలమయం కావడంతో ప్రయాణానికి అంతరాయం కలిగింది. అడుగడుగునా ప్రమాదకరంగా మారిన రోడ్డును గమనించిన ఆయన గంగారం వద్ద కారు దిగి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడగా మంగళవారం రాత్రి కూడా ఈ గుంతల కారణంగా ప్రమాదం జరిగిందని, ఎవరికి చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు ఇచ్చిన ‘గుంతలతో సెల్ఫీ’ పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు రోడ్డు గుంతలతో సెల్ఫీ దిగి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం ఇసుక, మట్టి దందాలపై పెట్టిన శ్రద్ధ రోడ్ల మరమ్మతులపై పెట్టాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా ఒక్క తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదు. ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రజల ప్రాణాలు పోయేదాకా చూస్తూ ఉంటారా?” అని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన రోడ్లు తప్ప, కొత్తగా ఈ 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరై మొదలైన పనులను సైతం గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు మళ్లీ గెలవడం కష్టమని తెలిసి, ప్రజల గురించి పట్టించుకోకుండా, తమ కడుపులు నిండాలని అందరూ దోచుకునే పనిలో నిమగ్నమైపోయారని ఆరోపించారు. వెంటనే అంకంపాలెం అడవి నుంచి ములకలపల్లి వరకు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేకపోతే రోడ్డుపై ధర్నాకు సిద్ధం అవుతామని మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.









