దమ్మపేట సెంట్రల్ లైటింగ్ పనులపై ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తనిఖీ – నాణ్యత విషయంలో రాజీపడొద్దు: స్పష్టం
నిధులు అధికంగా కేటాయించాం, పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశం
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, అక్టోబర్, 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సెంట్రల్ లైటింగ్ పనులను నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం నాడు ఆకస్మికంగా పరిశీలించారు. పనుల పురోగతి, వినియోగిస్తున్న సామగ్రి నాణ్యతను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ సెంట్రల్ లైటింగ్ పనులు వేగంగా పూర్తయితే మండల కేంద్రం మరింత అందంగా సురక్షితంగా మారుతుందని ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ పనుల కోసం ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించిందని కాబట్టి నాణ్యతతో కూడిన పనులు చేయడం చాలా ముఖ్యమని అధికారులకు తెలిపారు. పనులలో ఎక్కడా నిర్లక్ష్యం చూపినా, నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడినా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులు ప్రజల సౌకర్యం కోసమే, పనులు ఆలస్యం కాకుండా, నిర్ణీత గడువులోగా, పూర్తి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలి అని అధికారులను ఆదేశించారు. పనుల పర్యవేక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ప్రతి దశలోనూ నాణ్యత ఉండేలా చూడాలని ఆయన సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు మరియు కాంట్రాక్టర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. త్వరలోనే సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.









