భూబాధితులకు భరోసా…అధైర్యపడవద్దు, ప్రభుత్వం అండగా ఉంది
* యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం పినపాక అభివృద్ధికి మైలురాయి.
*క్రీడా ప్రాంగణం శాశ్వతంగా కొనసాగేలా చర్యలు… ఎంపీ ఓ. వెంకటేశ్వరరావు హామీ
*బాధితులకు ఉద్యోగాలు, పశుసంవర్థక పథకాలలో ప్రాధాన్యం.
* విజయవంతంగా ముగిసిన గ్రామసభ..భూబాధితుల్లో నూతన ఆశ.
పినపాక,నేటి గదర్:
పినపాక మండలంలోని తోగూడం పంచాయతీ గోపాలరావుపేట గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి సేకరించిన భూముల కారణంగా తమ సాగుభూములు కోల్పోయిన రైతులకు అధికారులు, ప్రజాప్రతినిధులు న్యాయం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. “అధైర్యపడకండి… ప్రభుత్వం మీతోనే ఉంది” అని తాసిల్దార్ గోపాలకృష్ణ, స్పెషల్ ఆఫీసర్ సంకీర్త్ భరోసా ఇవ్వడంతో గ్రామసభ సంతృప్తికరంగా ముగిసింది.
**30 ఎకరాల భూమి సేకరణ..అధికారుల వివరణ**
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి గోపాలరావుపేట గ్రామంలో సర్వే నంబర్ 128లో 25 ఎకరాలు, సర్వే నంబర్ 512/1లో ఐదు ఎకరాలు, మొత్తం 30 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఈ భూముల్లో 30 మంది రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. స్కూల్ స్థాపనతో విద్యా అభివృద్ధికి మార్గం సుగమం కానుందని అధికారులు తెలిపారు.
**భూబాధితులకు ఉపాధి, పథకాల భరోసా**
తాసిల్దార్ జి. గోపాలకృష్ణ మాట్లాడుతూ, “భూములు కోల్పోయిన రైతులు అధైర్యపడవద్దు. యంగ్ ఇండియా స్కూల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో అర్హత ఆధారంగా బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం” అన్నారు.
ఇంకా, ప్రభుత్వ పథకాల కింద గొర్రెలు, కౌజు పిట్టలు, మేకలు, గేదెలు, కోళ్లు వంటి పశుసంవర్థక కార్యక్రమాల్లో బాధిత కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. “ప్రభుత్వం ఎవరి హక్కులు కోల్పోకుండా చూసుకుంటుంది” అని భరోసా ఇచ్చారు.
**క్రీడా ప్రాంగణం శాశ్వతం కావాలి…ఎంపీ హామీ**
గ్రామసభలో పాల్గొన్న ఎంపీ ఓ. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, “గోపాలరావుపేట క్రికెట్ గ్రౌండ్ పినపాక పరిసర గ్రామాల రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రంగా కూడా ఉపయోగపడుతోంది. ఈ క్రీడా మైదానం గ్రామ యువతకు క్రీడా వేదికగా నిలుస్తోంది. కాబట్టి ఈ ప్రాంగణాన్ని శాశ్వతంగా క్రీడా స్థలంగా కొనసాగించేలా జిల్లా కలెక్టర్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం” అన్నారు.
**అధికారుల చురుకుదనం..ప్రజల్లో నమ్మకం పెంపు**
గ్రామసభలో తాసిల్దార్ గోపాలకృష్ణ, స్పెషల్ ఆఫీసర్ సంకీర్త్, గ్రామ సెక్రటరీ సంధ్యారాణి, భూబాధితులు, రైతులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు ప్రజల సమస్యలను ఓర్పుగా విని, తగిన హామీలు ఇవ్వడం గ్రామ ప్రజల్లో నూతన నమ్మకాన్ని కలిగించింది.
**పినపాక అభివృద్ధికి కొత్త దిశ**
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పినపాక విద్యా రంగానికే కాదు, ప్రాంతీయ అభివృద్ధికి కూడా కీలకంగా నిలవనుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు, విద్యా వసతులు, క్రీడా మైదాన పరిరక్షణ వంటి అంశాలన్నీ కలిసొచ్చే ఈ నిర్ణయం పినపాక భవిష్యత్తుకు బలమైన బాట వేస్తోంది.
భూములు కోల్పోయినా ప్రభుత్వం తమను మరచిపోదనే నమ్మకాన్ని భూబాధితులలో కలిగించిన అధికారులు, ప్రజాప్రతినిధుల స్పందన ప్రశంసనీయం. “అధైర్యపడకండి… అండగా ఉంటాం” అన్న తాసిల్దార్ మాటలు రైతుల మనసుల్లో నూతన ఆశను నింపాయి. పినపాకలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం విద్యా విస్తరణకే కాదు ..అభివృద్ధి, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.









