తెల్లవారుజామున 4 నుండి 6 గంటల వరకు నాకాబంది: ఎస్సై యాయతిరాజు హెచ్చరిక – డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి పౌరుడు సహకరించాలి.
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 10: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చైతన్యం – డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మరింత వేగం పుంజుకుంది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం, యువతలో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా అశ్వారావుపేట పోలీసులు సోమవారం తెల్లవారుజామున విస్తృత స్థాయిలో నాకాబందు నిర్వహించారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారులు, ముఖ్యంగా అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతం మరియు భద్రాచలం రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలను తీవ్రతరం చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల వరకు జరిగిన ఈ నాకాబందిలో ప్రతి వాహనాన్ని ఆపి, క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు. పోలీసులు ప్రత్యేకంగా మత్తు పదార్థాల రవాణా, గంజాయి సరఫరా, నిషేధిత మందుల చలామణి వంటి అంశాలపై దృష్టి సారించారు. వాహనాలలో ఉన్న సీట్లు, ఇంజిన్ భాగాలు, బ్యాగులు, లగేజీలను కూడా జాగ్రత్తగా తనిఖీ చేశారు. ఈ నాకాబంది కార్యక్రమంలో అశ్వారావుపేట పోలీస్ ఎస్సై యాయతిరాజు తన సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి అని కోరారు. అలాగే ఎవరైనా గంజాయి లేదా ఇతర నిషేధిత పదార్థాలను వినియోగించినా విక్రయించినా లేదా రవాణా చేసినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు అని గట్టిగా హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రజల సహకారం లేకుండా డ్రగ్స్ నిర్మూలన సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు ప్రతి వారం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. పోలీసుల ఈ కఠిన చర్యతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. డ్రగ్స్ వ్యసనంతో యువత భవిష్యత్తు దెబ్బతింటోందని, పోలీసులు తీసుకుంటున్న చర్యలు సముచితం అని పలువురు అభిప్రాయపడ్డారు. నాకాబంది కారణంగా వాహనదారులు కొంతసేపు ఇబ్బంది పడినా ప్రజల భద్రత కోసం ఈ చర్యలు అవసరమని అంగీకరించారు.









