అశ్వారావుపేట రెడ్డిగూడెంలో ప్రత్యేక వైద్య శిబిరం ప్రారంభం; సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 11: గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడమే ఐటీడీఏ యొక్క ప్రధాన లక్ష్యం అని ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రతి వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం నాడు అశ్వారావుపేట మండలంలోని రెడ్డిగూడెం పాఠశాల ప్రాంగణంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఓ రాహుల్ మాట్లాడుతూ ప్రతి మారుమూల గ్రామంలోనూ ఆరోగ్య సదుపాయాలు చివరి వ్యక్తి వరకు చేరేలా విస్తృత చర్యలు తీసుకుంటున్నాము అని తెలిపారు. నాణ్యమైన వైద్య సేవలు పొందడం పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రాథమిక స్థాయిలోనే వ్యాధులు గుర్తించి చికిత్స అందించాలని సిబ్బందిని ఆదేశించారు. శిబిరం ప్రారంభం అనంతరం పీఓ రాహుల్ వివిధ వైద్య విభాగాలను నిశితంగా పరిశీలించారు. ప్రత్యేకంగా కంటి, స్త్రీల, చిన్నారుల, హృదయ, మానసిక, క్షయ (టీబీ) వ్యాధులకు సంబంధించిన పరీక్షా కేంద్రాల పనితీరును, అందుబాటులో ఉన్న వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ అప్పారావుతో పాటు పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. శిబిరం నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిన సిబ్బందిని పీఓ అభినందించారు.









