దమ్మపేటలో అక్రమ చొరబాటుదారులపై బీజేపీ హెచ్చరిక
ఢిల్లీ బాంబు దాడి నేపథ్యంలో భద్రతపై ఆందోళన – ఎస్సై, ఎంఆర్ఓ లకు వినతిపత్రం
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, నవంబర్, 12: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన బాంబు దాడి ఘటన దాని పర్యవసానాలను దృష్టిలో ఉంచుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో భద్రతపై భారతీయ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ బీజేపీ నాయకులు స్థానిక ఎస్సై మరియు మండల రెవెన్యూ అధికారి కార్యాలయాలలో వినతిపత్రం సమర్పించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత కొంతకాలం నుంచి దమ్మపేట మండల పరిధిలో కొందరు కొత్త వ్యక్తులు తిరుగుతున్నట్లు ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో జరిగిన విధ్వంసం వంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే, ఈ ప్రాంతంలో తిరుగుతున్న అక్రమ చొరబాటుదారులు ఎవరైనా ఉంటే వారిని వెంటనే గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. మండలంలో శాంతిభద్రతలను కాపాడడంలో ప్రజల భద్రతను నిర్ధారించడంలో అధికారులు వెంటనే చొరవ తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ వినతిపత్రం సమర్పణ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి, నాగరాజు, ఉడతనేని విశ్వేశ్వరరావు, గూడా ముత్యాలరావు, కారం రత్నా కుమారి, బెల్లం కృష్ణవేణి, నాగుల చందు, సొరకాయల సీతారాములు, గ్రంధి రాఘవేంద్ర గుప్తా తదితరులు పాల్గొన్నారు.









