ఏడాదిన్నరగా సాగుతున్న పనులు -అశ్వారావుపేటలో రోడ్డుపై బైఠాయించిన ప్రజలు
ఎండలు వస్తే దుమ్ము, వానలు వస్తే బురద – షాపుల అద్దాలు పగులుతుండటంతో ఆస్తినష్టం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణ కేంద్రంలో రోడ్డు పనుల జాప్యంపై స్థానిక ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పనులు ప్రారంభించి దాదాపు ఏడాదిన్నర అయినప్పటికీ, అవి నేటికీ పూర్తి కాకపోవడంతో విసుగు చెందిన గ్రామస్తులు బుధవారం పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వారి ఆందోళన కారణంగా కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉండటం వల్ల ప్రజలు వాతావరణ కష్టాలను ఎదుర్కొంటున్నారు. వానలు వస్తే రోడ్డు పూర్తిగా బురదమయంగా మారి రాకపోకలు స్తంభించిపోతుంటే, ఎండలు వస్తే విపరీతమైన దుమ్ము, ధూళి ప్రజలకు శ్వాసకోశ సమస్యలకు, కాలుష్యానికి కారణమవుతోంది. పనులు సరిగా జరగకపోవడం వల్ల రోడ్డుపై వేసిన కంకర రాళ్లు పైకి లేచి ఉన్నాయి. ఈ కంకర రాళ్లు వేగంగా వెళ్లే వాహనాల టైర్ల కింద నలిగి, శక్తివంతంగా పైకి లేచి రోడ్డు పక్కన ఉన్న వ్యాపార సముదాయాల అద్దాలపై పడుతున్నాయి. ఈ రాళ్ల దెబ్బకు ఇప్పటికే పలు షాపుల ముందు అద్దాలు పగిలి ద్వంసమయ్యాయని, వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక, ఈ విధంగా ఎగిరే రాళ్ల కారణంగా ప్రయాణికులకు, పాదచారులకు తగిలి ప్రాణాపాయం కలిగే ప్రమాదం కూడా ఉందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం అధికారులు మరియు కాంట్రాక్టర్ పనుల వేగాన్ని పెంచి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రోడ్డును పూర్తి చేయాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే, ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.









