అరటి తోట భూ వివాదం -ఇద్దరిపై కత్తిపోట్లు, పరిస్థితి విషమం
నారంవారి గూడెంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ; ఆసుపత్రికి తరలింపు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, నారంవారిగూడెంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో భూ వివాదం కారణంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రక్తసిక్తమైంది. కత్తిపోట్లకు గురైన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నారంవారిగూడెం గ్రామానికి చెందిన మంగా వెంకటేశ్వర్లు, మంగా గణేష్ అనువర్లు అనే వ్యక్తులు శ్రీహరి అనే వ్యక్తి నుంచి ఐదెకరాల పొలాన్ని కొనుగోలు చేసి, అందులో అరటి తోట వేశారు. అయితే, అదే గ్రామానికి చెందిన గేదెల విష్ణు అనే వ్యక్తి ఆ భూమి తమదేనంటూ తమ వద్ద ఉన్న ఆధారాలు చూపించి, అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, మూడు నెలల క్రితం ప్రారంభమైన ఈ భూ వివాదంపై ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు, కానీ సమస్య ఒక కొలిక్కి రాలేదు. తాజాగా, గేదెల విష్ణు తమ కుమారుడు గేదెల సురేష్కు చెందిన అరటి తోటను నరుకుతున్నారని ఆరోపిస్తూ మంగా వెంకటేశ్వర్లు, మంగా గణేష్ పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే పొలంలో ఉన్న గేదెల విష్ణు కుటుంబ సభ్యులతో వారు మాట్లాడుతుండగా, ఒక్కసారిగా ఇరుపక్షాల మధ్య ఘర్షణ చెలరేగింది. కర్రలతో పోరాటం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో, గేదెల విష్ణు మనవడు గేదెల వినయ్ కత్తితో మంగా వెంకటేశ్వర్లు, మంగా గణేష్పై దాడి చేశాడు. కత్తిపోట్ల కారణంగా మంగా వెంకటేశ్వర్లు, మంగా గణేష్ తలకు తీవ్ర గాయాలై, రక్తం ఎక్కువగా పోవడంతో అక్కడే కుప్పకూలారు. స్థానికులు వారిని వెంటనే అశ్వారావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని ఖమ్మంకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.









