ఈ- కేవైసీ కారణంతో దేశంలో ఎన్ని రేషన్ కార్డులను రద్దు చేశారు..?
* ఆ వివరాలు, ప్రస్తుతం ఉన్న కార్డుల గణాంకాలు తెలపండి
* 14వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం లక్ష్యం, బిడ్ల వివరాలేంటి..?
* ఆరో విడత మైనింగ్ లీజులు, తెలంగాణలో వీటి పరిధిలోని ఖనిజ గనుల పరిస్థితి ఏంటి..?
* లోక్ సభలో ప్రస్తావించిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
* లిఖితపూర్వక సమాధానాలిచ్చిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నిముబెన్ జయంతి భాయ్.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
న్యూ ఢిల్లీ: లబ్ధిదారులు బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ (ఈ-కేవైసీ) చేయించుకోలేదనే కారణంతో రాష్ట్రాల వారీగా అక్టోబర్ నాటికి రద్దయిన రేషన్ కార్డులు, ప్రస్తుతం ఉన్న కార్డుల గణాంకాలు తెలపాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా.. బుధవారం ఈ అంశంతో పాటు 14వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం లక్ష్యం, బిడ్ల వివరాలు, ఇంకా..ఆరో విడత మైనింగ్ లీజులు, తెలంగాణ రాష్ట్రంలో ఖనిజ గనుల పరిస్థితి తెలపాల్సిందిగా కోరారు. ఈ ప్రశ్నలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి జీ.కిషన్ రెడ్డి, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల సహాయ మంత్రి నిముబెన్ జయంతి భాయ్ బాంభాణియా వేర్వేరుగా లిఖితపూర్వక సమాధానాలిచ్చారు.
తెలంగాణలో మొత్తం రేషన్ కార్డులు 56,60,367, రద్దయినవి 1,40,947
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎఫ్ సీఏ) నిబంధనల మేరకే లబ్ధిదారుల గుర్తింపు, జాబితాల నిర్వహణ ఉంటుందని దేశంలో అక్టోబర్ నాటికి గణాంకాల ప్రకారం 20,29,52,938 రేషన్ కార్డులు ఉన్నాయని, తెలంగాణలో 56,60,367 మంది కార్డులు కలిగి ఉన్నారని కేంద్ర, ప్రజా పంపిణీ శాఖల సహాయ మంత్రి నిముబెన్ జయంతి భాయ్ బాంభణియా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2020 నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 1,40,947 రేషన్ కార్డులు రద్దు అయ్యాయని, అయితే.. అనర్హులు, చనిపోయిన వ్యక్తుల కార్డులే తొలగించామని, ఈ-కేవైసీ కారణంతో ఎక్కడ కూడా కార్డుల తొలగింపు నమోదు కాలేదని వివరించారు.
14వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలంలో బిడ్ల సమర్పణకు ఈ నెల 15 వరకు గడువు..
ఏడాదికి 35.41 మిలియన్ టన్నుల ఉత్పత్తిని అందించే సామర్థ్యం కలిగి ఉండి దేశ వ్యాప్తంగా మొత్తం 41 వాణిజ్య బొగ్గు గనులకు సంబంధించిన వేలం ప్రక్రియ అక్టోబర్ 29న ప్రారంభం కాగా.. ఇందులో తెలంగాణ నుంచి ఒక గని ఉందని, ఈనెల 15వ తేదీ నాటికి బిడ్ల సమర్పణకు గడువు ముగుస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి రంగాన్ని మరింత బలోపేతం చేయడం లక్షమని, ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్ టీసీ లిమిటెడ్ ద్వారా ఈ – వేలం నిర్వహిస్తామని తెలిపారు. పర్యావరణ రక్షణ చట్టం-1986, అటవీ సంరక్షణ చట్టం – 1980ల ద్వారా జీవవైవిధ్యం, గాలి, నీటి నాణ్యత దెబ్బతినకుండా, ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన పునరావస వసతి సౌకర్యాలు కల్పించేలా చూస్తామని పేర్కొన్నారు.
తెలంగాణలో వేలానికి రెండు ఖనిజ బ్లాక్ లు
ఆరో విడతలో వివిధ రాష్ట్రాల్లో వేలానికి ప్రతిపాదించబడిన ఖనిజ గనుల బ్లాక్ లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరిధిలో రెండు ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. రసాయన మూలకమైన వెనాడియం, ఇంకా.. టైటానియం, అల్యూమినియం, లేటరైట్ ఖనిజ నిక్షేపాల గనులు ఇందులో ఉన్నాయని, ఖచ్చితమైన ప్రణాళికతో.. గనుల ప్రభావిత ప్రాంతాల్లో నిర్వాసితులకు లబ్ధి కలిగేలా ముందుకెళతామని వివరించారు.









