గ్రామ ప్రజలు స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోవాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.
మొదటి విడత గ్రామ పంచాయతీ పోలింగ్ కు సర్వం సిద్దం.
ఉదయం 7 గంటల నుండి ఒంటి గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని, ప్రజలు ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపు నిచ్చారు.డిసెంబర్ 11న మొదటి విడతలో నిర్వహించే గ్రామ పంచాయతీల ఎన్నికల సందర్భంగా రఘునాథపాలెం మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలలో బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ లో వినియోగించే ఎన్నికల సామాగ్రిని పరిశీలించి, పోలింగ్ సిబ్బందితో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పలు సూచనలు చేస్తూ, ఓటర్ లకు బ్యాలెట్ పేపర్స్ ఇవ్వడం, పివో డైరీ నింపడం, అన్ని ఫార్మ్స్ ఎలా నింపాలి, ఏజెంట్స్ సిగ్నేచర్ తీసుకోవడం, పోలింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీలింగ్, ఓట్ల కౌంటింగ్, సర్పంచ్ నియామక పత్రాలు ఇవ్వడం, ఉప సర్పంచ్ ఎన్నిక తదితర అంశాల మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల విధులు నిర్వహించే వారు, వారికి ఏర్పాటు చేసిన చోటనే బస చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ. డిసెంబర్ 11 గురువారం మొదటి విడతలో జిల్లా నందు ఏడు మండలాలలో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని అన్నారు.ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని, ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుండి కౌంటింగ్ నిర్వహించి, ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేసి ఫలితాలను వెల్లడిస్తామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు కల్పించామని వివరించారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ గుర్తించి క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరా ద్వారా నిరంతర పర్యవేక్షిస్తామన్నారు. సెన్సిటివ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లు నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.*గ్రామ పంచాయతీ పోలింగ్ లో ప్రజలు ఎటువంటి ఒత్తిడులు, భయాందోళనలు లేకుండా తమ ప్రజాస్వామ్యమైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించాలని అన్నారు.గ్రామంలో ప్రతి ఓటు విలువైనదని, ఓటర్లు అందరూ నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చి, ఎవరి ప్రభావానికి లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని కలెక్టర్ కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో పూర్తి అయ్యే వరకు గ్రామాలలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, మొదటి, రెండవ దశలో ఎన్నికైన అభ్యర్థులు, ఇతరులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించరాదని, ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలలో సైతం ఎన్నికల కోడ్ అమలులోనే ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ సిబ్బంది, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, ప్రత్యేక అవసరాలున్న ఓటర్లకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో జి. నరసింహారావు, రఘునాధపాలెం తహసీల్దారు శ్వేత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.









