జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.
-జిల్లా కలెక్టర్ను కలిసిన టిడబ్ల్యూజేఎఫ్ (H-2843) ఖమ్మం జిల్లా నాయకులు
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లాలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్ H-2843) ఖమ్మం జిల్లా నూతన కమిటీ సభ్యులు బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాద పూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి నేతృత్వంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కమిటీ నూతనంగా ఎన్నికైన విషయాన్ని తెలియజేస్తూ, జిల్లా కలెక్టర్ కి నియామక పత్రాన్ని అధికారికంగా అందజేశారు. అనంతరం ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు మంజూరు చేయడం, ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు, మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు తగిన ఎక్స్గ్రేషియా మంజూరు వంటి అంశాలపై వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని, ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావాలంటే జర్నలిస్టులకు భద్రతతో పాటు సంక్షేమం కూడా అవసరమని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమైతే పాలన మరింత పారదర్శకంగా, ప్రజలకు మరింత చేరువగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జర్నలిస్టులు ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధులని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నిబంధనల మేరకు సాధ్యమైన పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో మీడియా సహకారం ఎల్లప్పుడూ అవసరమని ఆయన తెలిపారు.
ఈ భేటీలో టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా సెక్రటరీ నానబాల రామకృష్ణ, కోశాధికారి అర్వపల్లి నగేష్, జిల్లా ఉపాధ్యక్షులు అంతోటి శ్రీనివాస్, మందడపు మనోహర్, వేల్పుల నాగేశ్వర రావు, (టీబీజేఏ) జిల్లా అధ్యక్షులు వీ. సామ్రాట్ గుప్తా, కార్యవర్గ సభ్యులు ఉపేంద్ర, శ్రీధర్, మధు, కే. నాగకృష్ణ, ఎం. కిరణ్, సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.









