మణుగూరులో పెండింగ్ సమస్యలపై జాగృతి అధ్యక్షురాలు కవితకు వినతిపత్రం…
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
మణుగూరు మరియు పరిసర గిరిజన గ్రామాల్లో ఏళ్లుగా పరిష్కారం కాని పౌర, ఉపాధి, ఆరోగ్యం, విద్య సంబంధిత సమస్యలపై తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, కల్వకుంట్ల కవిత కి మణుగూరుకు చెందిన సామాజిక కార్యకర్త కర్నె రవి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమం మణుగూరు–ఇల్లందు గెస్ట్ హౌజ్లో జరిగింది.
వినతిపత్రంలో మణుగూరు మున్సిపాలిటీని మళ్లీ మెజర్ గ్రామ పంచాయితీగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపాలిటీగా మారిన తర్వాత చినరాయిగూడెం, కమలాపురం, అన్నారం, రాజుపేట వంటి గిరిజన గ్రామాలకు 100 రోజుల ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)తో పాటు గ్రామ పంచాయితీ సంక్షేమ పథకాలు అందడం లేదని పేర్కొన్నారు.
గత సుమారు 20 ఏళ్లుగా మణుగూరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతిని పరిపాలనా నిర్లక్ష్యం నెలకొందని తెలిపారు. అలాగే కాళీమాత ఏరియా–గాంధీనగర్ ప్రాంతంలో సింగరేణి ఓపెన్కాస్ట్ గనుల వల్ల తీవ్ర దుమ్ము, ధూళి కాలుష్యం ఏర్పడి ప్రజలు ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాన్ని ప్రమాదకర జోన్గా ప్రకటించి, 2016లో పునరావాసం సూచించినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని వినతిలో పేర్కొన్నారు.
అదేవిధంగా మణుగూరులో మంజూరైన జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలను అడవి ప్రాంతానికి తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎస్సీసీఎల్, బీటీపీఎస్ వంటి పరిశ్రమల కారణంగా ప్రాక్టికల్ శిక్షణకు మణుగూరే అనుకూలమని, కళాశాల ఇక్కడే కొనసాగాలని కోరారు. కళాశాల కోసం బీటీపీఎస్ మంజూరు చేసిన రూ.1.30 కోట్ల సీఎస్ఆర్ నిధుల వినియోగంపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కర్నె రవి, మణుగూరు మున్సిపాలిటీని మెజర్ గ్రామ పంచాయితీగా మార్చడం, గిరిజన గ్రామాలకు ఉపాధి హామీ పథకాలు పునరుద్ధరించడం, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం, గాంధీనగర్ కాలుష్య బాధితులకు న్యాయం చేసి పునరావాసం కల్పించడం, జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలను మణుగూరులోనే కొనసాగించడం వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవితను విజ్ఞప్తి చేశారు.









