కొమ్ముగూడెంలో మిన్నంటిన క్రిస్మస్ సంబరాలు: ముఖ్య అతిథులుగా హాజరైన బీఆర్ఎస్ నాయకులు సోయం వీరభద్రం, సర్పంచ్ సత్యవతి
యేసు ప్రభువు దీవెనలతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం –ప్రత్యేక ప్రార్థనల అనంతరం కేక్ కట్ చేసిన నేతలు
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 25: అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం కొమ్ముగూడెం మరియు కొమ్ముగూడెం కాలనీ గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పాస్టర్లు మరియు దైవసేవకుల ఆహ్వానం మేరకు అశ్వరావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోయం వీరభద్రం, కొమ్ముగూడెం సర్పంచ్ శ్రీమతి సోయం సత్యవతి ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ పవిత్ర దినం సందర్భంగా చర్చిలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, వారు దైవసేవకుల సమక్షంలో కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ.. లోక రక్షకుడైన యేసుప్రభువు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు బోధించిన ప్రేమ, దయ, శాంతి మార్గాలు విశ్వ మానవాళికి ఎల్లప్పుడూ ఆచరణీయమని ఆయన కొనియాడారు. ప్రజల ఆశీర్వాదంతో కొమ్ముగూడెం గ్రామ పంచాయితీ సర్పంచ్ గా సోయం సత్యవతిని అఖండ విజయంతో గెలిపించడం సంతోషదాయకమని, రాబోయే ఐదేళ్ల కాలంలో గ్రామ అభివృద్ధి కోసం, ప్రజారంజకమైన పాలన అందించడానికి యేసుప్రభువు వారికి తగిన శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దైవసేవకులతో పాటు బిఆర్ఎస్ నాయకులు సోయం రాజుబాబు, కొమ్ముగూడెం వైస్ సర్పంచ్ బుద్దుల శ్రీను, వార్డు సభ్యులు సోయం మేరి, సోయం సత్యనారాయణ, బుద్దుల కృష్ణ, జోనుబోయిన సుబ్బారావు, కీసరి మల్లికార్జునరావు, పాస్టర్లు తామ ఆదినారాయణ, సోయం నరసింహారావు, సంఘసేవకులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.









