ఐద్వా జాతీయ మహాసభకు వేలాదిగా కదిలి రండీ.
జనవరి 25-28 వరకు 14వ జాతీయ మహాసభలు
జనవరి 25న హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ
ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ
నేటి గదర్ న్యూస్, వైరా:
2026 జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాద్ లో నిర్వహించే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని, జాతీయ మహాసభ సందర్భంగా జనవరి 25న హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు వేలాదిగా మహిళలు కదిలి రావాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో ఐద్వా వైరా డివిజన్ కమిటీ సమావేశం డివిజన్ అధ్యక్షురాలు కొండబోయిన ఉమావతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బుగ్గవీటి సరళ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మొదటిసారి ఐద్వా జాతీయ మహాసభ జరుగుతుందని తెలిపారు. జనవరి 25న ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి మహిళలు పెద్దఎత్తున తరలి రావాలని కోరారు. నాలుగు రోజులపాటు హైదరాబాద్లో జరిగే మహాసభలో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించి, భవిష్యత్ కర్తవ్యాలను రూపొందిస్తామన్నారు. మహిళల భద్రత, మహిళల చట్టాలు, హక్కులు, విద్య, బాల్య వివాహాల నిషేధం, ఆస్తి హక్కు చట్టం, వరకట్న వేధింపుల నిరోధానికి ఐపీసీ 498 ఏ సెక్షన్, కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్, గృహా హింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు వంటి అనేక సమస్యలపై దేశవ్యాప్తంగా ఐద్వా అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, మైనార్టీలు, దళితులు, అట్టడుగు వర్గాలకు భద్రత కరువైందని, మహిళలు, యువతులపై వేధింపులు, హత్యలు, లైంగిక దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐద్వా జాతీయ మహాసభకు జాతీయ నాయకులు బృందాకారత్, అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీమతి టీచర్, మరియం దావలె, జాతీయ నాయకులు ఎస్.పుణ్యవతి, సుధా సుందర రామన్ తోపాటు దేశవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఐద్వా జాతీయ మహాసభ విజయవంతం కోసం సెమినార్లు, సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. మహాసభ విజయవంతానికి ప్రజలందరూ ఆర్థిక, హార్దిక సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మెరుగు రమణ, వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, ఐద్వా సీనియర్ నాయకురాలు మచ్చా మణి, తాతా పద్మ, పెద్దమళ్ళ పద్మ తిలకం, తాళ్లపల్లి విజయ, బాణాల వెంకట్రావమ్మ, కంసాని మల్లికాంబ, కెసగాని నీలిమ, మెకల స్వరూపా రాణి తదితరులు పాల్గొన్నారు.









