సేవాభావంతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
ఎన్ఎస్ఎస్ క్యాంపులతో సామాజిక బాధ్యత పెంపొందుతుంది -అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, డిసెంబర్, 27: విద్యార్థి దశ నుంచే సేవాభావం, సామాజిక బాధ్యతను అలవర్చుకోవడం వల్ల ఉన్నతమైన పౌరులుగా ఎదుగుతారని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పేర్కొన్నారు. మండలంలోని పాతనారంవారిగూడెంలో అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని ఎమ్మెల్యే అన్నారు. ఇలాంటి సేవా శిబిరాల ద్వారా విద్యార్థులకు క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన కలుగుతుందని అభిప్రాయపడ్డారు. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, అక్షరాస్యత వంటి అంశాలపై గ్రామస్థుల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూనే, సమాజ హితం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రజలకు ఉపయోగపడేలా విద్యార్థులు చేస్తున్న సేవలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తుమ్మా రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు, సర్పంచ్ మునుగొండ నాగమణి పాల్గొన్నారు. వీరితో పాటు కళాశాల అధ్యాపక బృందం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.









