గండుగులపల్లి హెచ్ఎం రాయల హనుమంతరావు పదవీ విరమణ వేడుక ఘనం
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, డిసెంబర్, 31: సమాజ భవిష్యత్తును నిర్మించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే శిల్పులు వారేనని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాయల హనుమంతరావు పదవీ విరమణ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారే ముఖ్య అతిథిగా హాజరై, హనుమంతరావు దంపతులను శాలువాతో సత్కరించి ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కంటే అత్యంత గౌరవప్రదమైనదని కొనియాడారు. హనుమంతరావు తన సుదీర్ఘ సర్వీసులో అనేక తరాల విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చి, గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చారని ప్రశంసించారు. కేవలం పాఠ్యాంశాలే కాకుండా నైతిక విలువలు, దేశభక్తిని పెంపొందించడంలో ఆయన కృషి మరువలేనిదన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా తన అనుభవాన్ని విద్యా రంగానికి అందిస్తూ మార్గదర్శకుడిగా కొనసాగాలని ఆకాంక్షించారు. హనుమంతరావు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పాఠశాలలో విద్యా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని ఉపాధ్యాయ బృందం పేర్కొంది. విద్యార్థుల హాజరు శాతం పెంచడంతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన విశేషంగా కృషి చేశారని కొనియాడారు. గ్రామాభివృద్ధిలోనూ ఆయన చురుగ్గా పాల్గొనేవారని గ్రామ పెద్దలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమంతరావుకు ఘనంగా వీడ్కోలు పలికారు.









