దిబ్బగూడెంలో దుప్పట్ల పంపిణీ.. ప్రతి ఏటా సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ముందడుగు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్ట్రర్: దాది చంటి) జనవరి, 01: కొత్త సంవత్సరం వేళ ఆడంబరాలకు పోకుండా, పేద ప్రజల ఆకలి తీరుస్తూ, చలిలో వణికే వృద్ధులకు అండగా నిలవడమే నిజమైన పండుగని నిరూపించారు అశ్వారావుపేట మండలం వినయకపురం గ్రామానికి చెందిన రైతు బిడ్డ బిర్రం వెంకటేశ్వరరావు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా గురువారం మండలంలోని దిబ్బగూడెం గ్రామ పంచాయతీలో గిరిజన వృద్ధులకు ఆయన దుప్పట్లు పంపిణీ చేశారు. తన మనవళ్లు, మనమరాల పుట్టినరోజులైనా, పండుగలైనా గిరిజన గ్రామాల్లోని పేదలకు చీరలు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేయడం వెంకటేశ్వరరావుకు ఒక ఆనవాయితీ. ఈ ఏడాది కూడా కటిక చలిలో ఇబ్బంది పడుతున్న వృద్ధులను గుర్తించి, వారికి వెచ్చని దుప్పట్లు అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిబ్బగూడెం గ్రామ సర్పంచ్ పండా రాజు మాట్లాడుతూ గ్రామాభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వృద్ధులతో నేరుగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తమ కష్టాలను గుర్తించి ఏటా సాయం అందిస్తున్న బిర్రం వెంకటేశ్వరరావు కుటుంబం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గిరిజన వృద్ధులు ఆశీర్వదించారు. తమ అవసరాలు తీరుస్తూ నిరంతరం అండగా ఉంటున్నందుకు గ్రామ ప్రజలు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.









