మంత్రి సొంత మండలంలోనే ఈ దుస్థితా? తక్షణమే తాహిసీల్దార్ ను నియమించాలని డిమాండ్
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 02: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి పూర్తిస్థాయి ఎమ్మార్వోను కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో కీలకమైన దమ్మపేట మండలంలో గత కొంతకాలంగా ఎమ్మార్వో అందుబాటులో లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు, ముఖ్యంగా రైతులు తమ పనుల కోసం కార్యాలయం చుట్టూ తిరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ బాధ్యతలు చేపట్టిన అధికారులు వచ్చిన కొద్ది రోజులకే బదిలీపై వెళ్లడం లేదా ఇతర ప్రాంతాలకు మారిపోవడం పరిపాటిగా మారిందని విమర్శించారు. ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాలో, అందునా రాష్ట్ర మంత్రి సొంత మండలంలోనే ఇలాంటి దుస్థితి నెలకొనడం శోచనీయమని వారు ధ్వజమెత్తారు. ఉన్నత స్థాయి అధికారులు, పాలకులు వెంటనే స్పందించి దమ్మపేట కార్యాలయానికి శాశ్వత ప్రాతిపదికన ఎమ్మార్వోను నియమించి పాలనను పట్టాలెక్కించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి, సీనియర్ నాయకులు గొట్టిపూళ్ల శ్రీనివాసరావు, కొలీకపోగు ముసలయ్య, పసుపులేటి నాగరాజు, సోయం వెంకట్, మహిళా నాయకులు కారం రత్నకుమారి, ఆళ్ల సుజాత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.









