నేటి గదర్ న్యూస్, వైరా:
మార్పు స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ బజార్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మహిళా ఈర్ల కృష్ణవేణికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న ఈర్ల కృష్ణవేణి భర్త ఈర్ల రమేష్ కీడ్నీ వ్యాదితో బాధపడుతూ ఇటీవల కాలంలో మరణించారు. భర్త అకాల మరణంతో కుటుంబ పోషణకు, ఇద్దరు ఆడపిల్లలను చదివించడానికి ఈర్ల కృష్ణవేణి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని సిపిఐ(ఎం) వైరా శాఖ సభ్యులు ద్వారా తెలుసుకున్న మార్పు స్వచ్ఛంధ సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత శుక్రవారం స్వయంగా కృష్ణవేణి ఇంటికి వెళ్ళి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిన నేటి సామాజిక పరిస్థితులలో ఒక మహిళ ఒంటరిగా కుటుంబ బాధ్యతలు మోయడం, ఇద్దరి ఆడ పిల్లలను చదివించడం చాలా కష్టమైన విషయం అన్నారు. చిన్న సహాయం కూడా ఆపదలో ఉన్నవారికి చాలా ఉపయోగ పడుతుందని, మానవత్వంతో దాతలు ముందుకు వచ్చి ఈర్ల కృష్ణవేణి కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు గుడిమెట్ల మోహనరావు, సిపిఐ(ఎం) వైరా శాఖ కార్యదర్శి ఓర్పు సీతారాములు, శాఖా సభ్యులు వల్లెపు ఏడుకొండలు, దేవళ్ళ క్రిష్ణ, బత్తుల ప్రమీల, దేవళ్ళ మంగ, బండారి మేఘన తదితరులు పాల్గొన్నారు.









