* అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని విన్నపం
* రేషన్ కార్డులు, మీ-సేవా కేంద్రం ఏర్పాటుపై వినతి
* సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 02: అశ్వారావుపేట మండలంలోని రామన్నగూడెం గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ మడకం నాగేశ్వరరావు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు జటిలమైన సమస్యలను ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గ్రామంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్ కోరారు. అదేవిధంగా, కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పేద ప్రజలకు నెలలు గడుస్తున్నా కార్డులు మంజూరు కాలేదని, దీనివల్ల వారు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామన్నగూడెం కేంద్రంగా చుట్టుపక్కల 6 గ్రామాలకు అందుబాటులో ఉండేలా ఒక ‘మీ-సేవా’ కేంద్రాన్ని మంజూరు చేయాలని విన్నవించారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి ప్రహరీ గోడ నిర్మాణం, ప్రధాన రహదారుల నుంచి కార్యాలయం వరకు సీసీ రోడ్ల ఏర్పాటు, అంగన్వాడీ మరియు గిరిజన పాఠశాలల వద్ద కల్వర్టుల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరారు. అలాగే, రహదారులకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని తొలగించి స్పీడ్ బ్రేకర్లు మరియు వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. అక్రమ ఇసుక, మట్టి రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టరుకు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. సర్పంచ్ వివరించిన సమస్యలపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తానని, పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మడకం నాగేశ్వరరావుతో పాటు ఉప సర్పంచ్ కోర్స కళ్యాణి, మాజీ సర్పంచ్ మడకం స్వరూప, వార్డు మెంబర్లు మోడియం రమాదేవి, సోరేం రవి, మడకం కన్నారావు, చింతం వెంకన్నబాబు, మాడి దుర్గ, పేసా కార్యదర్శి మాడి సీతారాముడు మరియు రామన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సుమారు 200 మంది ప్రజలు పాల్గొన్నారు.









