నేటి గద్దర్ న్యూస్,అశ్వరావుపేట, జనవరి, 05: భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలను అశ్వరావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు మోటూరి మోహన్ తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ఒక వ్యక్తి కాదు, కోట్ల మంది గుండెల్లో కొలువైన దైవమని ఆయన పేర్కొన్నారు. సోమవారం అశ్వరావుపేటలో జరిగిన మీడియా సమావేశంలో మోహన్ మాట్లాడుతూ.. “నేను కేసీఆర్ గారి కూతురిని, ఏ మాటలైనా అనేస్తాను అంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేమీ చిల్లర వ్యక్తులం కాదు. నిండు శాసనమండలి సాక్షిగా ‘ఏం పీకి కట్టలు కట్టారు’ అని బాపును ఉద్దేశించి మాట్లాడటం నీ అహంకారానికి పరాకాష్ఠ. నిన్ను కన్న తండ్రి, రాష్ట్ర సాధకుడు అయిన కేసీఆర్ గారిని విమర్శించడానికి నీకు సిగ్గు, శరం లేదా?” అని నిలదీశారు. లిక్కర్ స్కామ్ కేసు నుండి తనను తాను కాపాడుకోవడానికి కవిత నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని మోహన్ ఆరోపించారు. “కేసుల నుండి తప్పించుకోవడానికి ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలకు మోకరిల్లుతున్నావు. నీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బురదలో ఉన్న పెండ తిని కూడా బ్రతుకుతావు అని నీ ప్రవర్తన ద్వారా అర్థమవుతోంది” అని ఘాటైన విమర్శలు చేశారు. తమ నాయకుడు కేసీఆర్ గారికి 60 లక్షల మంది కార్యకర్తల సైన్యం అండగా ఉందని, ఒక పవిత్ర యోధుడి కడుపున కవిత లాంటి “చీడపురుగు” పుట్టడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ని విమర్శించే స్థాయి కవితకు లేదని, తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.









