అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి భక్తుల కోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని కోరిన నేతలు
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 08: ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం అశ్వారావుపేట నియోజకవర్గం నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో నిర్వహించిన ప్రెస్ మీట్లో నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని అన్ని మండలాల నుండి ఆదివాసీ బిడ్డలు, భక్తులు తమ ఆరాధ్య దైవాల దర్శనం కోసం భారీ సంఖ్యలో మేడారం వెళ్తారని పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారి ప్రయాణ సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంతో పాటు ప్రధాన మండల కేంద్రాల నుండి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తంబళ్ల రవితో పాటు మహిళా నేతలు కారం రత్నకుమారి, ఆళ్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.









