అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన శుక్రవారం స్థానిక వ్యవసాయ కళాశాలలో రైతు సంక్షేమమే లక్ష్యంగా భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో బాలికల నూతన హాస్టల్ భవనానికి, సి.సి. రోడ్ల నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యవసాయ యాంత్రీకరణ పథకం, జాతీయ సహజ వ్యవసాయ మిషన్ను అధికారికంగా ప్రారంభించడంతో పాటు, ఆధునిక భూసార పరీక్షా కేంద్రం మరియు మొక్కల విశ్లేషణ ప్రయోగశాలను జాతికి అంకితం చేశారు. సహజ వ్యవసాయం ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకుని, ఉత్పాదకతను ఎలా పెంచుకోవాలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘రైతు మేళా’లో రైతుల సమస్యలను నేరుగా విన్న ఎమ్మెల్యే మరియు మంత్రులు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై రైతులకు భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐటీడీఏ పీఓ బి. రాహుల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్న ఈ సభలో, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రైతుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.









