పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే విద్యే ఏకైక మార్గమని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పష్టం చేశారు. శనివారం ఉదయం దమ్మపేట మండలంలోని మారుమూల అటవీ ప్రాంతాలైన పూసుకుంట, కట్కూరు గ్రామాల్లో ఆయన ‘హలో శుభోదయం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొండరెడ్డి గిరిజనులతో నేరుగా ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామాల్లో సాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కొండరెడ్డి గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా బడికి పంపి గొప్ప ప్రయోజకులను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చదువుతోనే గౌరవప్రదమైన జీవితం సాధ్యమని, ప్రజలంతా చైతన్యవంతులై ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆదినారాయణ ఆకాంక్షించారు.









