పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన
నేటి గద్దర్ న్యూస్,అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ కేటాయింపులు చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం అశ్వారావుపేటలో రూ.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణలతో కలిసి ఆయన ఘనంగా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, పల్లెల మధ్య వ్యత్యాసం లేకుండా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అందులో భాగంగానే అశ్వారావుపేటలో అంతర్గత రహదారులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, స్వచ్ఛమైన తాగునీరు, కమ్యూనిటీ హాళ్లు మరియు పార్కుల అభివృద్ధి వంటి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా అవసరాలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా నిధులు విడుదల చేస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా నేతలు పునరుద్ఘాటించారు. కార్యక్రమ అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయ్ బాబు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.









