దమ్మపేటలో పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చిన ఎమ్మెల్యే.. సమస్యల పరిష్కారానికి హామీ!
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 23: దమ్మపేట మండల పరిధిలోని మందలపల్లి సెంటర్లో శుక్రవారం ఒక వినూత్న దృశ్యం ఆవిష్కృతమైంది. గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు వీధులను శుభ్రం చేస్తున్న క్రమంలో అక్కడికి చేరుకున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్వయంగా పారిశుధ్య పనుల్లో నిమగ్నమయ్యారు. కార్మికులతో కలిసి స్వయంగా చీపురు పట్టి రోడ్ల వెంట ఉన్న చెత్తను తొలగిస్తూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండను, వానను లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. గ్రామాల పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కార్మికులతో కొద్దిసేపు ముచ్చటించిన ఎమ్మెల్యే, వారి పనిలో ఎదురవుతున్న ఇబ్బందులను, వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి న్యాయపరమైన డిమాండ్లను త్వరలోనే అసెంబ్లీ వేదికగా ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా భరోసా కల్పించారు. ప్రజాప్రతినిధి హోదాలో ఉండి కూడా సామాన్య కార్మికులతో కలిసి పని చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.









