*ప్రచురణార్ధం*
*అక్రెడిటేషన్ కార్డు ఉంటేనే జర్నలిస్టా?*
*-‘ప్రెస్’ స్టిక్కర్ నిబంధన సరికాదు*
*-టీడబ్ల్యూజేఎఫ్ నేత మామిడి సోమయ్య*
హైదరాబాద్, జనవరి 26:
అక్రెడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలకు ‘ప్రెస్’ అని రాసుకోవాలంటూ రాష్ట్ర సమాచార పౌరసంబధాల కమీషనర్ హుకుం జారీ చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. జర్నలిస్టులను, జర్నలిజం వృత్తికి అవమానించే విధంగా జారీ చేసిన సర్క్యలర్ ను వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు సంక్షేమ పథకాలకు గుర్తింపు కార్డుగా జారీ చేసే అక్రెడిటేషన్ కార్డు ఉన్న వారే తమ వాహనాలకు “ప్రెస్”అని రాసుకోవాలనే నిబంధన సరైంది కాదని, ఈ సర్క్యులర్ నిబంధన ఇటు జర్నలిస్టుల సమాజానికి,అటు వారి వృత్తి స్వేచ్ఛకు భంగం కలిగేదిగా, అవమానకరంగా ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే అక్రెడిటేషన్ కార్డు కలిగి ఉన్న జర్నలిస్టులు మాత్రమే జర్నలిస్టులు కాదని, అక్రెడిటేషన్ కార్డు లేని జర్నలిస్టులు చాలా మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల మంది జర్నలిస్టులు వుండగా, వీరిలో సగం మంది జర్నలిస్టులకు మాత్రమే ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డులు ఇస్తున్నదని, మిగతా సగం మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్ ఎన్ ఐ (ప్రస్తుత పీ ఆర్ జీఐ) రిజిస్ట్రేషన్ పొందిన మీడియా సంస్థలు, పత్రికల్లో పనిచేస్తున్న చాలా మంది జర్నలిస్టులు వారి వారి మీడియా సంస్థల గుర్తింపు కార్డులతో పనిచేస్తున్నారని అన్నారు. వీరందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఉండవని, అంత మాత్రాన ఆ జర్నలిస్టులను సమాజంలో జర్నలిస్టులే కాదనే విధంగా తమ వాహనాలకు ప్రెస్ స్టిక్కర్ పెట్టుకోవద్దంటూ ప్రభుత్వం నిబంధనలు విధించడం సరైంది కాదని అన్నారు. సమాజంలో నకిలీ జర్నలిస్టులను కట్టడి చేయడానికి వేరే రూల్స్ పెట్టి నియంత్రించవచ్చని, అలాంటి చర్యలకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో అసలైన జర్నలిస్టులను అవమానించడం, అడ్డుకోవడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికే అక్రెడిటేషన్ కార్డు లేని అనేక మంది జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనా సర్క్యులర్ “మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు”గా అంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొంది లక్ష్మలాది రూపాయల పెట్టుబడితో నడుస్తున్న అనేక చిన్న మధ్య తరహా పత్రికలు రాష్ట్ర ప్రభుత్వ ఎంపానల్మెంట్ కాక, అక్రెడిటేషన్ కార్డులు లేక చితికిపోతున్నాయని, అటువంటి పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులను జర్నలిస్టులే కాదనే పద్దతిలో ఇలాంటి నిబంధనలు విధించడం అన్యాయమని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ ద్వారా వెలువడిన ఈ సర్క్యులర్ నిబంధన ను వెంటనే ఉపసంహరించాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు.









