అశ్వారావుపేట 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్: దగ్గరుండి వేయించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా
బీఆర్ఎస్, టీడీపీ ఐక్యతతో మున్సిపల్ పీఠంపై ధీమా వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా
నేటి గద్దర్ న్యూస్,అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 28: అశ్వారావుపేట మున్సిపాలిటీకి తొలిసారి జరుగుతున్న ఎన్నికల వేళ రాజకీయ సందడి పెరిగింది. బుధవారం 3వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా యూఎస్ ప్రకాశ్ రావు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్వయంగా దగ్గరుండి అభ్యర్థిచే నామినేషన్ వేయించి, ఎన్నికల బరిలో వెన్నంటి ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపడంతో, ఇరు పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి అభ్యర్థికి సంఘీభావం ప్రకటించారు. నామినేషన్ అనంతరం జరిగిన ప్రదర్శనలో మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేవలం ఈ వార్డులోనే కాకుండా, మున్సిపాలిటీలోని అన్ని వార్డులలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందుతారని, అశ్వారావుపేట మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వార్డు అభివృద్ధిని కాంక్షించే వారంతా ప్రకాశ్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు.









