ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ‘డైవర్షన్’ పాలిటిక్స్: మాజీ జెడ్పీటీసీ విమర్శ
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 30: తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ కీలక నేతలకు సిట్ నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు, మాజీ జెడ్పీటీసీ సున్నం నాగమణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం అశ్వారావుపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్పై, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్లపై ఫోన్ ట్యాపింగ్ నెపంతో ఉద్దేశపూర్వకంగా నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, తన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అభివృద్ధిని విస్మరించి కేవలం ప్రతిపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ‘డైవర్షన్’ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు.









