కేసీఆర్పై సర్కార్ కక్షసాధింపు.. అశ్వారావుపేటలో బీఆర్ఎస్ భారీ నిరసన
సిట్ విచారణ పేరుతో వేధింపులు ఆపాలి -మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 01: తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ విచారణ పేరుతో సాగిస్తున్న అక్రమ రాజకీయ వేధింపులను నిరసిస్తూ అశ్వారావుపేటలో బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో భారీ ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, మరియు మాజీ జెడ్పీటీసీ సున్నం నాగమణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన జాతిపితపై ఫోన్ ట్యాపింగ్ నెపంతో కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను, ఉచిత హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ సహా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందని వారు ధ్వజమెత్తారు. ప్రభుత్వం తన వికృత వైఖరిని వీడకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తూ, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.









