ఖమ్మం లో పలు అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల
శంకుస్థాపన
నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్:
జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో గల 6, 7 డివిజన్లలో కోటీ యాభై లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు శనివారం
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ నగర జనాభా ఐదు లక్షలతో శరవేగంగా విస్తరిస్తోందని, అందుకనుగుణంగా రహదారులు, త్రాగునీరు, మౌళిక సదుపాయాల కల్పన చేస్తున్నట్లు తెలిపారు. చేపట్టిన పనులు పది కాలాలపాటు ఉపయోగపడేటట్టుగా చూడాలన్నారు. ప్రజలు సుఖశాంతులతోటి సంతోషంగా ఉండాలంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం లేకుండా, నీరు నిల్వకుండా చూడాలని అన్నారు.విద్యా, వైద్య సౌకర్యాలు రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఖమ్మం లో ఉన్నాయన్నారు. దేశంలో పేరున్న స్వామి నారాయణ విశ్వవిద్యాలయం మన దగ్గరనే ఏర్పాటు చేశామన్నారు. మెడికల్ కాలేజీ కూడా రేపు రాబోయే కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి తోటి ప్రారంభోత్సవం చేస్తారని, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎంతవరకు వీలు ఉంటే అంతవరకు అభివృద్ధి చేస్తున్నామన్నారు. మౌలిక వసతులకు పెద్ద పీట వేస్తున్నామని, డ్రైనేజీ, అండర్ డ్రైనేజ్ కు ప్రాధాన్యత ఇస్తూన్నామని తెలిపారు. రోడ్లు వెడల్పు చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని మంత్రి అన్నారు. గోశాల కు రోడ్డు వెడల్పు చేస్తామని తెలిపారు.ప్రజలందరూ సుఖశాంతులతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్టు మంత్రి అన్నారు. హైదరాబాద్ కంటే ఆసుపత్రులు,విద్యా వ్యవస్థను చేస్తున్నామన్నారు. ఖమ్మం లో నివసించాలని ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ ప్రధాన సమస్యలని గుర్తించి అమృత్ పథకం కింద రూ. 200 కోట్లు, యూజీడీ కింద రూ.250 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. కొత్తగా విలీనమైన పంచాయతీల్లో రహదారులు, డ్రైన్లు నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని మంత్రి అన్నారు. రహదారుల విస్తరణ, డ్రైనేజీ పనులు పక్కాగా దీర్ఘకాలం ఉపయోగపడేలా చేస్తామని తెలిపారు.
ప్రతి ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. విద్య, వైద్యం మెరుగ్గా ఉండటంతో ఇతర జిల్లాల ప్రజలు కూడా ఖమ్మంలో స్థిరపడుతున్నారని అన్నారు.
ఖమ్మాన్ని శుభ్రమైన పట్టణంగా, సౌకర్యాలున్న నగరంగా అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖమ్మం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.









