పథకాల కోసం దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
అట్టహాసంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 18: ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకే అందాలని, ఈ ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయానికి తావులేదని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పష్టం చేశారు. బుధవారం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో దమ్మపేట మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని, ఎవరైనా మధ్యవర్తులు ఆశ చూపిస్తే నమ్మవద్దని, నేరుగా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధియే తన ధ్యేయమని, దమ్మపేట మండలంలోని ప్రతి పల్లెకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేరేలా అంకితభావంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వాసం రాణి, తహసీల్దార్ రామ్ నరేష్, ఆర్ఐలు సోయం భిక్షమయ్య, వంకా వీరస్వామి, జూనియర్ అసిస్టెంట్ ఎస్డి అలీ, జలీల్ పాషా మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.








