భద్రాద్రి #పినపాక ఈరోజు మధ్యాహ్నం అమ్మవారిపల్లి సమీపంలోని ఎల్ & టి స్టాఫ్ యార్డ్ వద్ద నుంచి అమ్మగారిపల్లికి చెందిన ఒక వ్యక్తి సుమారు రూ.80,000 విలువ చేసే ఇనుము సామాగ్రిని అక్రమంగా తరలిస్తుండగా అక్కడి సిబ్బంది అప్రమత్తమై పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్తో పాటు అతడిని పోలీస్ స్టేషన్కు అప్పగించారు. సెక్యూరిటీ జనరల్ మేనేజర్ జాయింట్ చక్రవర్తి ఫిర్యాదు మేరకు సీఐ అశోక్ రెడ్డి కేసు నమోదు చేసినట్లు సమాచారం.
అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీతమ్మసాగర్ ప్రాంతంలో ఇనుపరాడ్ల దొంగతనం జరుగుతుండటానికి స్థానికంగా కాంగ్రెస్ కార్యకర్తలే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు అధికారుల అండదండలతోనే మెటీరియల్ మొత్తం దొంగిలించబడిందని కూడా ఆరోపిస్తున్నారు. పట్టుబడిన ఇనుపరాడ్ల లోడ్ బండిని ఇప్పటివరకు స్టేషన్కు తరలించకుండా బయటనే ఉంచి సెటిల్మెంట్ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
ఈ ఘటనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు గారు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చట్టం ఒకలా, అధికార పార్టీ వారికి మరోలా వ్యవహరిస్తున్నారా? ప్రజా ఆస్తుల దోపిడీపై కఠిన చర్యలు తీసుకోకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు.
ప్రజల సొమ్ముతో నిర్మితమవుతున్న సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు చెందిన ఇనుపరాడ్లు దొంగిలించడం అత్యంత గంభీరమైన విషయం అని, ఇందులో ఎవరు ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని రేగా కాంతారావు గారు తెలిపారు. ప్రజాస్వామ్యంలో చట్టం అందరికీ సమానమని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
ప్రజా ఆస్తుల రక్షణలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలే తగిన విధంగా స్పందిస్తారని హెచ్చరిస్తూ, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.









