నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 28: దేశ సేవలో తరించిన ఆర్మీ జవాన్ మారం కేశవరెడ్డి మృతి తీరని లోటని, వారి త్యాగం మరువలేనిదని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు కొనియాడారు. శనివారం బూర్గంపహాడ్ మండలం రెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన జవాన్ కేశవరెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొని, జవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శోకతప్త హృదయంతో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యాన్ని నింపారు. దేశం కోసం ప్రాణాలర్పించే జవాన్ల కుటుంబాలకు సమాజం ఎల్లప్పుడూ అండగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాలి శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి, కోటి రెడ్డి, రాము, మారం చంద్రశేఖర్ రెడ్డి తదితర ముఖ్య నేతలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.








