వైజ్ఞానిక ప్రదర్శనలతో ఆకట్టుకున్న విద్యార్థులు.. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణపై అవగాహన
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 28: స్థానిక అశ్వారావుపేట పట్టణంలోని జవహర్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకురాలు సంతపూరి భారతీదేవి, ప్రిన్సిపాల్ ఎస్. మైధిలి, మరియు కరస్పాండెంట్ ఐ. ప్రవీణ్ కుమార్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. 1928 ఫిబ్రవరి 28న సర్ సి.వి. రామన్ ‘రామన్ ఎఫెక్ట్’ను ఆవిష్కరించి నోబెల్ బహుమతి సాధించిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు సైన్స్ పట్ల మక్కువ పెంచేలా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల వర్కింగ్ మోడల్స్, సోలార్ సిస్టమ్ ప్రయోగాలు మరియు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించే ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, పాఠశాలలోని అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలు, ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు విద్యార్థుల మేధాశక్తిని పదును పెడుతున్నాయని, భవిష్యత్ అంతా సైన్స్పైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు ప్రస్తుత సామాజిక సమస్యల పరిష్కారానికి ఎంతో ఉపయోగపడతాయని వారు ప్రశంసించారు. అనంతరం ప్రదర్శనల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








